నేటి భారత్ న్యూస్- అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్న సంపన్నులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఆఫర్ ను తీసుకురాబోతున్నారు. సిటిజన్ షిప్ (పౌరసత్వం)ను అంగట్లో అమ్మకానికి పెట్టబోతున్నారు. 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.44 కోట్లు) చెల్లిస్తే ‘గోల్డ్ కార్డ్’ ద్వారా అమెరికాలో నివసించేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు. గ్రీన్ కార్డ్ ద్వారా పొందే అన్ని సౌకర్యాలను ఈ గోల్డ్ కార్డ్ తో పొందవచ్చని, దీంతో సిటిజన్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. మొత్తంగా పది లక్షల గోల్డ్ కార్డ్ లను విక్రయించాలని ట్రంప్ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉన్నప్పటికీ త్వరలోనే ఈ గోల్డ్ కార్డ్ ను ట్రంప్ అంగట్లోకి తీసుకురావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇలా డబ్బులతో అమెరికా సిటిజన్ షిప్ కొనుక్కునే విధానం ఇప్పటికే అమలులో ఉందని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈబీ-5 పోగ్రాం కింద విదేశీయులు గ్రీన్ కార్డ్ పొందే వెసులుబాటు ఉందన్నారు. ఇందుకోసం అమెరికాలో 8 లక్షల డాలర్ల నుంచి 20 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా కనీసం పదిమంది అమెరికన్లకు శాశ్వత ఉద్యోగం లభించాలి. పెట్టుబడులను కనీసం రెండేళ్ల పాటు కదిలించకూడదనే షరతులు ఈబీ-5 పోగ్రాంలో ఉన్నాయి. ఈ నిబంధనలను పాటించిన వారికి ఈబీ-5 పోగ్రాం కింద అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డ్ అందజేస్తుంది.