

నేటి భారత్ న్యూస్- హైదరాబాదులో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారని, అందుకే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ లేకుండా పోయిందని కేటీఆర్ వివరించారు. ఎక్కే విమానం, దిగే విమానం తప్ప రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 16 నెలలైనా పూర్తి స్థాయి క్యాబినెట్ లేదని అన్నారు. రేవంత్ వెనుక కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లున్నారని, వేల కోట్ల స్కాం కోసం సీఎం చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్టు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ఎంతో కృషి చేశామని కేటీఆర్ చెప్పారు. కానీ తామే ఎయిర్ పోర్టు తెచ్చామని కాంగ్రెస్ వాళ్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీ జరుగుతుండగానే, ఈ-కార్ రేసింగ్ కేసులో తనకు మరోసారి నోటీసులు ఇస్తారని భావిస్తున్నానని కేటీఆర్ వెల్లడించారు. అయితే అదొక లొట్టపీసు కేసని, దాని గురించి భయపడబోనని స్పష్టం చేశారు.