

నేటి భారత్ న్యూస్-అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు (మార్చి 8) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పలు పథకాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో తీసుకువచ్చిన ఇందిరా మహిళా శక్తి మిషన్ ను ఆవిష్కరించనున్నారు. డ్వాక్రా సంఘాల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. తద్వారా 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.ఇక, ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులను ప్రారంభించనున్నారు. అటు, మహిళలే నిర్వహించేలా 31 జిల్లాల్లో పెట్రోల్ బంకులు ప్రారంభించేందుకు చమురు సంస్థలతో నేడు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేయనున్నారు. 400 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.40 కోట్ల ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేస్తారు.