

నేటి భారత్ న్యూస్- అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో ఈ అంశం భారత పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చింది. అమెరికా ప్రభుత్వం మరో 295 మంది భారతీయ అక్రమ వలసదారులను వెనక్కి పంపనుంది. వీరంతా ప్రస్తుతం తమ నిర్బంధంలో ఉన్నారని, త్వరలో వారిని తిరిగి పంపించివేస్తామని అమెరికా అధికారులు తెలిపినట్లు కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం రాజ్యసభకు తెలియజేసింది. సీపీఐ సభ్యుడు జాన్ బ్రిటన్ దీనిపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 2009 నుండి 2024 వరకు అమెరికా సర్కారు అక్రమ వలసదారులను పంపిన వివరాలను విదేశాంగ శాఖ వెల్లడించింది. అక్రమ వలసదారులను వెనక్కి పంపించే ప్రక్రియ ట్రంప్కు ముందే మొదలైందని, 2009 నుంచి 2024 మధ్యకాలంలో 15,564 మందిని వెనక్కి పంపారని తెలిపింది. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో 6 వేల మంది భారతీయులను అక్రమ వలసదారులుగా గుర్తించి పంపించేశారు. బైడెన్ హయాంలో అదే తరహాలో 3,652 మంది భారతీయ అక్రమ వలసదారులను తిరిగి పంపించారని విదేశాంగ శాఖ వివరించింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 388 మందిని వెనక్కి పంపగా, మరో 295 మంది బహిష్కరణకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, భారతీయ అక్రమ వలసదారులను సంకెళ్లు వేసి అమానుషంగా ట్రంప్ సర్కారు తరలించిన అంశం వివాదాస్పదమైంది. విపక్షాలు, భారత ప్రభుత్వం దీనిపై నిరసన వ్యక్తం చేశాయి. పై గణాంకాలను బట్టి చూస్తే, అక్రమ వలసదారులను వెనక్కి పంపించే విషయంలో ట్రంప్ కంటే బైడెన్ సర్కారే బెటర్ అన్న అభిప్రాయాలు భారతీయుల నుంచి వినిపిస్తున్నాయి.