

నేటి భారత్ న్యూస్-సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం విశాఖపట్నంలో స్టూడియోల నిర్మాణానికి గతంలో ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ క్రమంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు స్టూడియో నిర్మాణానికి 35 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ భూమిని స్టూడియో కోసం వినియోగించకుండా కొంత భూమిని లేఅవుట్లు వేసి విక్రయించే ప్రయత్నాలు జరిగాయి. ఆ నేపథ్యంలో విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు న్యాయపోరాటం ద్వారా లేఅవుట్ విక్రయాలను నిలుపుదల చేయించారు. తాజాగా ఆయన ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. రామానాయుడు స్టూడియోకు గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఈ స్టూడియో నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం 35 ఎకరాలను కేటాయించగా, అందులోని 15.17 ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని గత ప్రభుత్వ హయాంలో ప్రయత్నించారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిని స్టూడియో కోసం వినియోగించడం లేనందున ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.