

నేటి భారత్ న్యూస్- భారత్కు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రికార్డుస్థాయి ధర పలికింది. ‘గ్రామయాత్ర’ పేరుతో గీసిన చిత్రం వేలంలో ఏకంగా రూ. 118 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో భారతీయ చిత్ర కళలో ఇది అత్యంత ఖరీదైన కళాఖండంగా రికార్డులకెక్కింది. హుస్సేన్ ఈ చిత్రాన్ని 1950లలో గీశారు. న్యూయార్క్లోని క్రిస్టీలో ఈ నెల 19న ఈ వేలం నిర్వహించగా రికార్డుస్థాయి ధర పలికింది. ప్రసిద్ధ చిత్రకారిణి అమృతా షేర్గిల్ 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రానికి 2023లో ముంబైలో నిర్వహించిన వేలంలో రూ. 61.8 కోట్ల ధర పలికింది. ఇప్పుడు హుస్సేన్ చిత్రం ఆ రికార్డును బద్దలుగొట్టి దేశ చిత్ర కళలో అత్యంత ఖరీదైన కళాఖండంగా నిలిచింది. 14 అడుగుల కాన్వాస్ కలిగి ఉన్న హుస్సేన్ ‘గ్రామయాత్ర’ చిత్రం.. అప్పటికి కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశంలోని గ్రామీణ జనజీవన వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. ఈ చిత్రాన్ని 1954లో నార్వేకు చెందిన డాక్టర్ లియాన్ ఎలియాస్ వొలొదార్ స్కీ కొనుగోలు చేసి 1964లో ఓస్లో యూనివర్సిటీ ఆసుపత్రికి అందించారు. ఇప్పుడీ చిత్రాన్ని అమ్మగా వచ్చిన మొత్తాన్ని యూనివర్సిటీ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తారు.