

నేటి భారత్ న్యూస్- ది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ జెన్జో తాజాగా క్యాబ్ తరహాలో అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాల్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ సదుపాయాన్ని కల్పించేందుకు 450 నగరాల్లో 25 వేల అంబులెన్స్లను జెన్జో ప్రారంభించింది. అత్యవసర సమయాల్లో స్పందించే తీరు, ప్రథమ చికిత్స, సీపీఆర్ శిక్షణ అందించేందుకు జొమాటో సహా ఇతర ఇ కామర్స్ సంస్థలతో జట్టు కట్టినట్లు జెన్జో తెలిపింది. మెడికల్ ఎమర్జెన్సీ సేవల మౌలిక సదుపాయాలను డిజిటల్ టెక్నాలజీ సాయంతో అందించడమే తమ లక్ష్యమని జెన్జో సహ వ్యవస్థాపకులు, సీఈఓ శ్వేత మంగళ్ చెప్పారు. ఇందు కోసం జాతీయ స్థాయిలో 1800 102 1298 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు ఆసుపత్రులు, స్థానిక అధికారులు, కార్పొరేట్, ప్రైవేటు అంబులెన్స్ లతో జట్టు కట్టినట్లు కంపెనీ వెల్లడించింది. డిమాండ్ను బట్టి అంబులెన్స్లను పెంచుతామని, మరిన్ని నగరాలకు విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఒకే తరహా చార్జీల విధానం ఉంటుందని తెలిపింది. తొలి 5 కిలోమీటర్లకు బేసిక్ అంబులెన్స్ ధర రూ.1500లుగా, కార్డియాక్ అంబులెన్స్కు తొలి 5 కిలోమీటర్లకు రూ.2500లుగా నిర్ణయించినట్లు శ్వేత మంగళ్ చెప్పారు. 5 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి కిలోమీటరుకు బేసిక్ అంబులెన్స్కు రూ.50 చొప్పున, కార్డియాక్ అంబులెన్స్కు రూ.100లు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.