నేటి భారత్ న్యూస్- క్రికెట్ అభిమానులకు ఇది ఆవేదన కలిగించే వార్త అనే చెప్పాలి. ఆస్ట్రేలియాలో ప్రఖ్యాతిగాంచిన గబ్బా స్టేడియం చరిత్రలో కలిసిపోనుంది. శతాబ్ద కాలానికిపైగా సేవలందించిన బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియం కనుమరుగు కాబోతోంది. 2032 ఒలింపిక్ గేమ్స్ తర్వాత ఈ స్టేడియంను కూల్చి వేస్తున్నట్టు క్వీన్స్ లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒలింపిక్స్ కోసం బ్రిస్బేన్ లోని విక్టోరియా ప్రాంతంలో 60 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో కొత్త స్టేడియంను నిర్మిస్తున్నారు. ఒలింపిక్స్ పూర్తయిన తర్వాత గబ్బా స్టేడియంను కూల్చేయబోతున్నారు. అప్పటి నుంచి కొత్త స్టేడియం క్రికెట్ మ్యాచ్ లకు వేదికగా మారుతుంది. వాస్తవానికి గబ్బా స్టేడియంను కూల్చివేసి... దాని స్థానంలో కొత్త స్టేడియంను నిర్మించాలని క్వీన్స్ లాండ్ ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. కొత్త స్టేడియం నిర్మాణం కోసం 2.7 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను కేటాయించింది. అయితే, ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. దీంతో, తన ప్లాన్ ను ప్రభుత్వం మార్చింది. గబ్బా స్టేడియంను కూల్చి వేసి, క్రికెట్ ను కొత్త స్టేడియంకు తరలించబోతున్నట్టు ప్రకటించింది.