

నేటి భారత్ న్యూస్- యూకే పార్లమెంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి హీత్రూ విమానాశ్రయంలో చిరుకు అభిమానులు, తెలుగు ప్రవాసుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో మెగాస్టార్కు బుగ్గపై ఓ మహిళా అభిమాని ముద్దుపెట్టి తన అభిమానాన్ని చాటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, “చిన్నప్పుడు చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాలని అల్లరి చేసిన నేనే, మా అమ్మను మెగాస్టార్ దగ్గరకు తీసుకెళ్లా” అని ఆ లేడీ ఫ్యాన్ కుమారుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలాఉంటే.. చిరంజీవికి ఈరోజు యూకే పార్లమెంట్లో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ బ్రిటన్ కి చెందిన అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా… మెగాస్టార్ను ఇతర ఎంపీల సమక్షంలో సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ… సినిమా, ప్రజాసేవ.. దాతృత్వానికి చిరు చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేయనుంది.