

నేటి భారత్ న్యూస్- తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే సభలో ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో, జగన్ కు ప్రతిపక్ష నేత హోదా అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని చట్టం చెబుతోందని అయ్యన్నపాత్రుడు తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. సభాపతికి దురుద్దేశాలు ఆపాదించడం అంటే సభా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. జగన్ అన్నీ తెలిసే అబద్ధాలు ఆడుతున్నారని, ఆయనను క్షమించి వదిలేస్తున్నామని తెలిపారు. జగన్ మాటలను ప్రేలాపనలుగా భావిస్తున్నామని అన్నారు.