

నేటి భారత్ న్యూస్- జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. జుతానాలోని అటవీ ప్రాంతంలో నలుగురు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు దాక్కున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు గురువారం ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ నాలుగో రోజు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ ఎన్కౌంటర్ ప్రదేశానికి వెళ్లి ఆపరేషన్ను పర్యవేక్షించారు. పాకిస్థాన్తో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని సన్యాల్ గ్రామంలోని ఓ నర్సరీలోని ఒక చిన్న ఎన్క్లోజర్ లోపల వారు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) ఈ ఆపరేషన్ ప్రారంభించింది. మార్చి 22 నుంచి పోలీసులు, సైన్యం, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. యూఏవీలు, డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వంటి అధునాతన నిఘా సాంకేతికతతో, చొరబాటుదారులను పట్టుకోవడానికి బలగాలు జల్లెడ పడుతున్నాయి.