

నేటి భారత్ న్యూస్- ఓ జాతరలో అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్సైపై కొందరు యువకులు దాడిచేసి, ఆమె జుట్టు పట్టుకొని కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామంలో ‘డ్యాన్స్ బేబీ డ్యాన్స్’ కార్యక్రమం నిర్వహించారు. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు హంగామా చేస్తూ డ్యాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్సై బి.దేవి వారిని వారించే ప్రయత్నం చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన యువకులు ఎస్సైపై దాడిచేశారు. ఆమె జుట్టు పట్టుకుని కొట్టారు. దీంతో ఆమె వారి నుంచి తప్పించుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వదలని నిందితులు అక్కడికి కూడా వెళ్లి నానా రభస చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సైకి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.