

నేటి భారత్ న్యూస్- తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. టీడీపీ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. “1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగు దేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీ. శే శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగు దేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలిచింది. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్కు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కు, నాయకులకు, కార్యకర్తలకు 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ ట్వీట్ చేశారు.