నేటి భారత్ న్యూస్- అంతర్జాతీయంగా ఒక కీలక పరిణామానికి అమెరికా శ్రీకారం చుడుతోంది. దేశాల మధ్య యుద్ధాల కారణంగా ఆయా దేశాలకు రక్షణ వ్యయం పెరుగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా తన రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచిన అమెరికా సహా పలు దేశాలు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలో అనేక దేశాలు హర్షించే ఒక ప్రతిపాదనను అమెరికా చేసింది. రక్షణ ఖర్చులను 50 శాతం తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, చైనాలకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వాగతించారు. అయితే చైనా మాత్రం దీనికి అంగీకరించలేదు.ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ సానుకూలంగా స్పందించడంతో, ఒకప్పుడు ప్రచ్చన్న యుద్ధం కొనసాగిన అమెరికా, రష్యా మధ్య స్నేహం చిగురించే ఆశలు కనిపిస్తున్నాయి. ట్రంప్ సూచన మంచి ప్రతిపాదన అని పుతిన్ పేర్కొన్నారు. ఇటువంటి ఫలితాలను అన్వేషించడానికి చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందని పుతిన్ ప్రకటించారు. అయితే, విస్తరణ వాదంతో అన్ని సరిహద్దు దేశాలతో గొడవలు పెట్టుకుంటున్న చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ మాత్రం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించారు.ట్రంప్ ప్రతిపాదనపై ఓ టీవీ ఇంటర్వ్యూలో మాస్కో వైఖరిని ప్రశ్నించగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమాధానమిచ్చారు. ఇది మంచి ఆలోచనగా తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 'అమెరికా రక్షణ బడ్జెట్ 50 శాతం తగ్గిస్తుంది. మనం కూడా 50 శాతం తగ్గిస్తాం. ఆపై చైనా కూడా చేరితే అంగీకారం కుదురుతుంది' అని పుతిన్ అన్నారు. చైనా తరపున తాను మాట్లాడటం లేదని చెబుతూనే రష్యా మాత్రం కచ్చితంగా చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు.రక్షణ ఖర్చులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించడం చూస్తే ఉక్రెయిన్ యుద్ధ విరమణకు సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.