

నేటి భారత్ న్యూస్- తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తులు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులతో కాంగ్రెస్ అధిష్ఠానం నేడు జాబితా విడుదల చేసింది. ఇందులో నటి, మాజీ ఎంపీ విజయశాంతి పేరు కూడా ఉంది. విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పేర్కొంది. కాగా, ఖాళీ కానున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్ కు దక్కనుండగా… నాలుగు కాంగ్రెస్ కు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో, ముగ్గురితో జాబితా ప్రకటించిన ఏఐసీసీ… నాలుగో స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 20న పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.