నేటి భారత్ న్యూస్- దేవాదుల ప్రాజెక్టు అన్ని దశల పనులను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ములుగు జిల్లాలోని దేవన్నపేట పంపుహౌస్ వద్ద ఆయన దేవాదుల ప్రాజెక్టు పంపులను ప్రారంభించారు. ఒక మోటార్ను ప్రారంభించి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీరు నేరుగా ధర్మసాగర్ రిజర్వాయర్లోకి చేరుకుంది. అనంతరం ఇరువురు మంత్రులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ సంవత్సరం చివరికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.