

నేటి భారత్ న్యూస్- శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానం దోహా నుండి బంగ్లాదేశ్ వెళుతోంది. మహిళా ప్రయాణికురాలిని వెంటనే విమానాశ్రయంలోని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆమె మృతి చెందారు.దోహా నుండి బంగ్లాదేశ్లోని ఢాకాకు వెళుతున్న క్యూఆర్-642 విమానం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్ కంట్రోలర్ అనుమతిని కోరింది. సంబంధిత శాఖల నుండి అనుమతి వచ్చాక మధ్యాహ్నం 3.25 గంటలకు విమానాన్ని ల్యాండింగ్ చేశారు. గుండెపోటుకు గురైన ప్రయాణికురాలి కోసం విమానాశ్రయ సిబ్బంది విమానాశ్రయంలో అంబులెన్సును సిద్ధంగా ఉంచారు. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.