

నేటి భారత్ న్యూస్- యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి రానుంది. ఆలయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండనుంది.యాదగిరిగుట్ట ఆలయానికి ట్రస్ట్ బోర్డు, పదవీకాలం, నిధులు, ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబంధించిన సర్వీస్ రూల్స్, ఈవోగా ఏ స్థాయి అధికారి ఉండాలనే వివరాలను మంత్రివర్గంకు నోట్ రూపంలో అందించారు. దేవాదాయ శాఖ చట్టం-1987లోని చాప్టర్ 14 కింద ఈ దేవస్థానాన్ని చేర్చారు. ఈ మేరకు అసెంబ్లీలో చట్టసవరణ చేయనున్నారని సమాచారం.యాదగిరిగుట్ట దేవస్థానానికి ఈవోగా ఐఏఎస్ అధికారిని, లేదంటే అదనపు కమిషనర్, ఆపై స్థాయి అధికారిని నియమించాలని మంత్రివర్గానికి సమర్పించిన నోట్లో పేర్కొన్నారు. బోర్డుకు చైర్మన్తో పాటు 10 మంది సభ్యులను నియమిస్తారు. ఇందులో ఒకరు ఫౌండర్ ట్రస్టీ కాగా, తొమ్మిది మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఎక్స్అఫీషియో సభ్యులు కూడా ఉంటారు.