

నేటి భారత్ న్యూస్- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లపై వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదయింది. నార్సింగి పోలీసులు అప్పుడు ఆయనను రిమాండుకు తరలించారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది. కేటీఆర్పై కేసు కొట్టివేత కేటీఆర్పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షలతో తనపై కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది.