

నేటి భారత్ న్యూస్- దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ విజయం సాధించడంతో, కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో రోహిత్ శర్మ నాయకత్వం, శారీరక సామర్థ్యంపై విమర్శలు చేసిన షామా మహమ్మద్, ఈ గెలుపు తర్వాత రోహిత్ను పొగడ్తలతో నింపడం విశేషం. రోహిత్ శర్మ 76 పరుగులతో అద్భుతమైన ఆటతీరు కనబరిచి జట్టును ముందుండి నడిపించాడని, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్లు ఆడారని ఆమె కొనియాడారు. అంతకుముందు, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్స్లో రోహిత్ శర్మ ఫిట్నెస్పై షామా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రోహిత్ శర్మ ఫిట్గా లేడని చేసిన ట్వీట్పై విమర్శలు రావడంతో ఆమె దానిని తొలగించారు. అంతేకాకుండా, గతంలో రోహిత్ను సాధారణ కెప్టెన్గా అభివర్ణించారు. ఫైనల్లో రోహిత్ శర్మ తన బ్యాట్తో రాణించి 76 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చాడు. తన ఫిట్నెస్, రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలకు బదులివ్వకుండానే ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. పాకిస్థాన్, యూఏఈలలో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత్ ప్రపంచ నంబర్ వన్ వన్డే జట్టుగా నిలిచింది.