

నేటి భారత్ – వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు వెళుతున్నారు. జిల్లాలోని పాలకొండలో ఇటీవల వైసీపీ నేత పాలవలస రాజశేఖరం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పాలకొండ వెళ్లనున్నారు. ఈ రోజు (గురువారం) ఉదయం 11 గంటలకు జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ చేరుకుంటారు. వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. అనంతరం పాలకొండ నుంచి నేరుగా బెంగళూరుకు జగన్ వెళ్లనున్నారు.వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం (81) ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. రాజశేఖరం మృతి విషయాన్ని విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు .. వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లగా, నాడు రాజశేఖరం కుమారుడు ఎమ్మెల్సీ విక్రాంత్, కుమార్తె శాంతిలను జగన్ ఫోన్లో పరామర్శించారు. ఈరోజు నేరుగా రాజశేఖరం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న వైఎస్ జగన్ మంగళవారం విజయవాడ జిల్లా జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ములాఖత్లో కలిసి పరామర్శించారు. బుధవారం గుంటూరు మిర్చి యార్డ్ను సందర్శించి రైతులతో మాట్లాడారు. మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.