

నేటి భారత్ న్యూస్- షికాగో విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఒక విమానం ల్యాండవుతున్న సమయంలో రన్వేపైకి మరో విమానం అడ్డంగా రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే తన విమానాన్ని తిరిగి టేకాఫ్ చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం అమెరికాలోని షికాగో విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే.. ఒమాహా నుంచి బయలుదేరిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం మంగళవారం ఉదయం 8:47 గంటలకు షికాగోలోని మిడ్ వే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండవుతోంది. విమానాశ్రయంలోని రన్వే 31సీపై దిగుతుండగా ఇదే రన్ వేపై ఛాలెంజర్ 350 ప్రైవేట్ జెట్ అడ్డంగా వెళుతోంది. చివరిక్షణంలో ఈ జెట్ ను గమనించిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం పైలెట్ మళ్లీ టేకాఫ్ తీసుకున్నాడు. దీంతో రెండు విమానాలు ఢీ కొనే ప్రమాదం తప్పింది. రెండో ప్రయత్నంలో సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం క్షేమంగా ల్యాండయింది. ఈ ఘటనపై దర్యాఫ్తు చేపట్టిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.. సదరు ప్రైవేట్ జెట్ పైలట్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా రన్ వేపైకి వచ్చాడని ప్రాథమికంగా తేల్చారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.